కష్టాలు మనిషిని
రాటుదేలాలా చేస్తాయి..కానీ చాలా మంది చిన్న కష్టాలకే భయపడిపోతుంటారు..
కష్టాలు మనిషి ఎదిగేందుకు ఒక సోపానాలు.. ఈ విషయాన్ని ఎవరూ
గుర్తించరు.. బాధను మరిచి ధైర్యంగా
నిర్ణయాలు తీసుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుంతుంది. కానీ అలా ఆలోచించే
వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు భోపాల్కి చెందిన పూనమ్ శ్రోతి! కేవలం తను ఎదురించడమే
కాదుఎంతోమంది చీకటి జీవితాల్లో భరోసాగా నిలిచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందిస్తున్నారు పూనమ్ శ్రోతి.. ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అన్నప్పుడు ఆ పని
కచ్చితంగా పూర్తి చేసి చూపిస్తాను అంటూ సానుకూల దృక్పథంతో మాట్లాడే ఆమె కథేంటో చదువుదాం! మనం కూడా స్పూర్తి
పొందుదాం!!
అరుదైన వ్యాధి...
ఆస్టియో జెనిసిస్
ఇంపరెక్టా. ఎముకలు గుల్లబారే వ్యాధి. చిన్నదెబ్బ తగిలినా సరే శరీరంలో ఎముకలు పటపట
విరిగిపోతాయి. 31 ఏళ్ల పూనమ్ కూడా
చిన్నప్పుడే ఈ వ్యాధి బారిన పడ్డారు. లక్షల మందిలో ఏ
ఒక్కరికో ఇద్దరికో వచ్చే అరుదైన వ్యాధి ఇది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎత్తు 2 అడుగుల 8అంగుళాలకు మించలేదు. ఆమె వయసుకన్నా
ఎన్నోరెట్లు ఎక్కువసార్లు ఎముకలు విరిగాయి. వాటిని
అతికించేందుకు ఎన్ని ఆపరేషన్లు చేశారో కూడా ఆమెకు గుర్తులేదు. ఈ వ్యాధికారణంగా తమ
బిడ్డను చూసి మొదట పూనమ్ తల్లిదండ్రులు బాధపడ్డారట. అయితే
తమకూతురు చదువులో ముందుండడం చూసి ప్రోత్సహించారు. అలా వారి ప్రోత్సాహంతో భోపాల్
కేంద్రీయ విద్యాలయం నుంచి 12వ తరగతి పూర్తి చేసిన ఆమె
ఆ తర్వాత డిగ్రీ, ఫైనాన్స్లో ఎంబీఏ
కంప్లీట్ చేసింది ఎంబీఏ అనంతరం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో హెచ్ఆర్ కూడా పూర్తి చేసింది పూనమ్.
అవకాశాలున్నా అందలేదు
చదువు సాఫీగా సాగినా
ఉద్యోగం విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఏ ఇంటర్వ్యూకు
వెళ్లినా ఎక్కువ తెలివితేటలున్నా.. శారీరక వైకల్యం కారణంగా ఉద్యోగ అవకాశం
ఇచ్చేందుకు ఏదో ఒక సాకుతో నిరాకరించేవారు. చివరకి ఓ కంపెనీలో సెలెక్ట్ అయింది.
నిజానికది పూనమ్ అర్హతకు తగ్గ ఉద్యోగం కాదు. అయినా దాన్నో సవాల్గా తీసుకుంది.
మిగతా వారిలాగే తాను కూడా పనిచేయగనని నిరూపించాలనుకుంది. దాదాపు ఐదేళ్ల
పాటు అదే కంపెనీలో పనిచేసిన ఆమె డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి చేరింది.
సమాజసేవకు అంకితం
జాబ్ చేస్తున్నప్పుడు
తనలాంటి వారిని చూసిన పూనమ్ వారికోసం ఏదైనా చేయాలన్న పట్టుదలతో జాబ్
మానేసింది. 2014లో ఉద్దీప్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసింది.
వికలాంగులు అందరూ కూడా మనసుకు నచ్చిన పనిచేసి సమాజంలో తమ కంటూ
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు సాయం చేయాలన్నదే ఆమె లక్ష్యం.
ప్రస్తుతం ఉద్దీప్ సంస్థ ద్వారా వికలాంగులకు సాయం చేయడంతో
పాటు గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికరత కోసం పనిచే
స్తోంది. అంతేకాదు వారి సాధికారత కోసం గత రెండేళ్లుగా ‘‘కెన్ డూ’’అనే పేరుతో ఒక ప్రచారం
నిర్వహిస్తుంది. వారిలో స్వశక్తితో కూడిన స్పూర్తిని నింపి అన్ని రంగాలలో ముందుకు
సాగేలా వారిని ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రాం
ప్రధాన ఉద్దేశం. కేవలం వారికోసమే కాక భోపాల్ చుట్టుపక్కల గ్రామాల మహిళ సాధికారిత
కోసం కృషి చేస్తోంది. వారికి చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్
కూడా ఇస్తోంది. స్వచ్ఛభారత్ లో భాగంగా పలు గ్రామాల్లో జరిగే
పరిశుభ్రతా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ తనవంతు సాయం
చేస్తోంది.
పుస్తకం పట్టేలా
ప్రోత్సహించి
ఆమె కృషి ఫలితంగా
భోపాల్ సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన మహిళలు సల్ప్హెల్ప్ గ్రూపుగా
ఏర్పడి చిన్న చిన్న పనుల ద్వారా ఎంతోకొంత ఆదాయాన్ని గడిస్తున్నారు. వీరికి అవసరమైన ముడి సరుకులను పూనమ్
అందిస్తోంది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా వివిధ కారణాల వల్ల చదువుకు దూరమైన
మహిళలు మళ్లీ పుస్తకం పట్టేలా ప్రోత్సహించింది పూనమ్. అంతేకాక
గ్రామీణ ప్రాంత పిల్లలందరూ చదువుకునేలా కృషి చేస్తోంది.
వారికి చదువుపై ఆసక్తి కలిగించేందుకు కంప్యూటర్ పాఠాలు నేర్పుతోంది.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
పూనమ్ టీంలోని
వాలెంటీర్లలో చాలా మంది ఆమె స్నేహితులే. ప్రస్తుతం 11మంది ఉద్దీప్
సంస్థ కోసం పనిచేస్తున్నారు. పూనమ్ చేస్తున్న సేవకు ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తోంది.
దేశంలో సమాజ సేవ చేస్తున్న 100 మంది ప్రముఖ మహిళల్లో ఒక్కరిగా
నిలిచిన పూనమ్.. ఈ మధ్యే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు
అందుకున్నారు. ప్రస్తుతం ఉద్దీప్ సంస్థ సేవల్ని మరింత విస్త్తృతం చేసే
ప్రయత్నంలో ఉంది. సమస్యలకు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించాలనే పూనమ్ ఆలోచన
నిజంగా ప్రశంసనీయం. సమాజంలో మంచి, చెడు ఉన్నట్లే ఈ రెండు
రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల్ని చూశానంటున్న పూనమ్, ఎవరైనా తనపట్ల వివక్ష చూపినా కుంగిపోకుండా దాన్ని పాజిటివ్
గా తీసుకోవడమే తన విజయాలకు కారణం అంటోంది.